telugu navyamedia
ఆరోగ్యం

మజ్జిగ – మహా పానీయం

“మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉండవు. ఈ కారణంగా, కైలాసంలో ఉండే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు. “

“ పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. “

“స్వర్గంలో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇంద్రుడు బలహీనుడు అయ్యాడు. “
“మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవే కాదు”
యోగ రత్నాకరం అనే వైద్యగ్ర౦థ౦లో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తు౦ది.
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వం”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ దీని భావం. అక్కడ దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టి౦చాడట!
వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా “లాక్టో బాసిల్లై” అనే “మంచి బాక్టీరియా” మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు.
అందుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది. *ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు.

చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.

*వేసవి కోసం ప్రత్యేక౦ “కూర్చిక పానీయం”
ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అఃదులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని ‘కూర్చిక’ అంటారు. ఇందులో “పంచదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొంఠి” ఈ మూడిఃటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦మండి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది.
*వడదెబ్బ కొట్టని పానీయం “రసాల”
పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్రంథంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శించటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థం ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉంది. భావ ప్రకాశ వైద్య గ్రంథంలో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివరంగా ఇచ్చారు
ఎండలోకి వెళ్లబోయే ముందు దీన్ని తాగండి
చక్కగా “చిలికిన మజ్జిగ” ఒక గ్లాసునిండా తీసుకోండి. అందులో ఒక “నిమ్మకాయ రసం”, తగినంత “ఉప్పు”, “పంచదార”, చిటికెడంత “తినేసోడాఉప్పు” కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన తరువాత ఇంకోసారి త్రాగండి.
ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి. మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు

Related posts