ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో ఈనెల 5వ తేదీ ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరాలని ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా కోరుకునుటున్నారు. బాలు కరోనా నుంచి కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఆయన సోదరి ఎస్పీ శైలజ ఆయన ఆరోగ్యంపై స్పందిస్తూ “బాలు గారి ఆరోగ్యం ఇప్పుడు ముందు కంటే మెరుగయ్యింది. అలాగే ప్రస్తుతం వెంటిలేషన్ తీసేశారని ఆయన ఆరోగ్యం పట్ల వైద్యులు ఆనందంగా ఉన్నారని అలాగే ప్రపంచం అంతా అన్నయ్య కోసం ప్రార్ధనలు చేస్తున్నారని తెలుసు. అందుకయినా సరే అన్నయ్య కోలుకొని తిరిగి వస్తారు” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బాలు చికిత్స పొందుతున్న వార్డులో ఆయన ఆలపించిన సినిమా పాటలను ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నారు. మరోవైపు స్వల్పంగా కరోనా వైరస్ సోకి హోం క్వారైంటెన్లో ఉంటూ చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు సతీమణి సావిత్రి సైతం అదే ఆస్పత్రిలో ఉన్నారు.

