ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు కొలువు దీరింది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 25 మంది నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జగన్ కేబినెట్ లో వేర్వేరు సామాజికవర్గాలకు ప్రాధాన్యత కల్పించారని ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి రాజుకృష్ణం రాజు ప్రశంసించారు. జగన్ కేబినెట్ సామాజిక విప్లవానికి నాంది గా భావిస్తున్నట్లు తెలిపారు. జగన్ కు, నూతన మంత్రివర్గానికి శుభాకాంక్షలు చెప్పారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బలహీన, మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. ఎవరూ ఊహించని విధంగా 8 మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా నేను భావిస్తున్నానని తెలిపారు. పరిణతి చెందిన ప్రజానాయకుడిగా మీరు స్పీకర్ పదవిని బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవిని బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయమని కృష్ణంరాజు ప్రశంసించారు.