కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ చట్టాన్ని పార్లమెంటులో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈరోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్టం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని తేల్చి చెప్పారు.
కొత్త విద్యుత్ చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు కొత్త మీటర్లు పెట్టాలని కేసీఆర్ అన్నారు. ఈ కొత్త చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఈ చట్టం ఉందని మండిపడ్డారు.
కొత్త చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలు విద్యుత్ ను కొనాలని అన్నారు. రైతులకు పెను భారంగా పరిణమించనున్న ఈ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి శాసనసభలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త చట్టం ప్రకారం కేంద్ర నుంచి మనం విద్యుత్తును కొనాల్సి ఉంటుందని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.