ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్ గారి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు.
అర్ధరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా? అని నిలదీశారు. రైతులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. ఈ మేరకు లోకేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు జగన్ గారు అంటూ హితవు పలికారు.

