తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు.
గోవుల మృతి ఘటనపై భూమన చేసిన ఆరోపణల నేపథ్యంలో, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు సహకరించాలని తిరుపతి వర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు అందజేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని గోశాలపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందాయని ఆయన విమర్శించారు.
వాటికి సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.