కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ మార్చి 9 శనివారం నిర్వహించబోతున్నారు . ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి తొలి సభ కావడంతో ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది.
నేడు కర్నాటకలో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాహుల్ అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వస్తారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలో కనీస ఆదాయ పథకాన్ని రాహుల్ ప్రకటించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 32వేల బూత్ స్థాయి కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పహాడీ షరీఫ్లో ఉన్న గ్రౌండ్లో దాదాపు మూడు లక్షల మందిని జనసమీకరణ చేసేందుకు పీసీసీ కసరత్తు చేసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ రాహుల్తో నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో… రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.