తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళం పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నేడు అఖిలపక్షం ధర్నాకు దిగనుంది. ఇంటర్ ఫలితాల గందరగోళానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్ష నేతలు ఇందిరా పార్క్ వద్ద ఆందోళన నిర్వహించనున్నారు.
ఈ ధర్నాలో పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొననున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, బోర్డు తప్పిదాలకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగనున్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.