నేడు బీజేపీ నేత అరుణ్ జైట్లీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి పలువురు పార్టీ మరియు పార్టీయేతరులు సంతాపం ప్రకటించారు. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా కూడా సంతాపం ప్రకటించింది. ఆయనకు నివాళిగా ఈ రోజు టీమిండియా ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ఆడుతున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా,ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అరుణ్ జైట్లీ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన సేవలు మరువలేనివని టీమిండియా ఆటగాళ్లు గుర్తు చేసుకున్నారు.
ఆయనకు నివాళిగా భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పాల్గొన్నారు. పలువురు క్రీడాకారులు కూడా జైట్లీ మృతి పట్ల సంతాపం తెలిపారు. దేశం ఓ గొప్ప వ్యక్తి కోల్పోయిందన్నారు. నా పితృ సమానుడైన అరుణ్ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుందని టీమిండియా మాజీ ఆటగాడు, ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. జైట్లీ ప్రజా జీవితంలోనే కాకుండా చాలామంది ఢిల్లీ క్రికెటర్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించేలా కీలక పాత్ర పోషించారని, డీడీఏసీలో ఆయన నాయకత్వంలో తనతో సహా ఎంతోమందికి అవకాశాలు వచ్చాయని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.