దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాల వల్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సగటు వర్షపాతం కన్నా.. పది శాతం ఎక్కువ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఐఎండీ, పీఐబీలు ట్వీట్లు పోస్టు చేశాయి. వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించాయి. జూన్ ఆరంభంలో కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించే నైరుతీ రుతుపవనాలు దాదాపు అన్ని రాష్ట్రాలను తాకినట్లు ఆ రిపోర్ట్ చెబుతోంది.
వివిధ రాష్ట్రాల్లో జూన్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీతో సీజన్ ముగిసినా.. ఈసారి నైరుతీ ప్రభావం అక్టోబర్ 10వ తేదీ వరకు ఉండే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ పేర్కొన్నది.