అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ టారిఫ్లతో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, టారిఫ్ల విషయంలో భారత్, అమెరికాల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. 90 రోజుల పాటు ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వర్తించదు.
అయితే, 90 రోజుల గడువు ముగుస్తోంది. జులై 9వ తేదీతో భారత్, అమెరికా టారిఫ్ ఒప్పందం రద్దు కానుంది. ఇదే గనుక జరిగితే మళ్లీ ట్రంప్ తెచ్చిన టారిఫ్ విధానాలు భారత్కు కూడా వర్తించనున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై.. టారిఫ్ గడువు ముగింపుపై స్పందించారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. రెండు దేశాలకు మేలు జరుగుతుందంటేనే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తాం.
డెడ్లైన్స్ పెట్టారని, సమయం ముగుస్తోందని ఇండియా వాణిజ్య ఒప్పందాలు చేసుకోదు’ అని అన్నారు.
పియుష్ గోయల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ, పియుష్ గోయల్పై మండిపడ్డారు.
ఈ మేరకు శనివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘పియుష్ గోయల్ ప్రగల్భాలు పలుకుతున్నారు.
ట్రంప్ టారిఫ్ డెడ్లైన్కు మోదీ తలొగ్గుతారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి. ఇదే జరుగుతుంది’ అని అన్నారు.