ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో నిన్న బీజేపీలో చేరారు. ఈ వ్యవహారం పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత అజెండాతోనే రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాయకులు పార్టీని వీడి చరిత్ర హీనులుగా మిగిలారని అన్నారు.
టీడీపీకి కోట్లాది మంది తెలుగు ప్రజల బలం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. టీడీపీ మరోసారి చరిత్రను తిరగరాస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దు అని పార్టీ శ్రేణులకు సూచించారు. నాకు సంక్షోభాలు కొత్తకాదు. నేను పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. తిరిగి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బీజేపీపై పోరాటం చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని చెప్పారు.