తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు.
తితిదే ఈవోగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు.
అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు సేవచేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవచేసే భాగ్యం దక్కిందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రభుత్వం, భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు, అధికారులతో పాటు అందరి సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేలా పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేసారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో బాధ్యతలనూ రవిచంద్ర నిర్వర్తించనున్నారు.

