హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లో దారుణం జరిగింది. ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే అతి కిరాతకంగా దారుణ హత్యకు గురైంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివర్లాలోకి వెళితే..
ప్రగతినగర్కు చెందిన కిరణ్, సుధారాణి(22) భార్యాభర్తలు. వీరికి నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. భార్యపై అనుమానంతో కిరణ్.. ఆమె గొంతు కోసి చంపాడు. అనంతరం చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిరణ్ చికిత్స పొందుతున్నాడు.
మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆయన కూతురు సుధారాణిని కామారెడ్డి పట్టణానికి చెందిన ఎర్రోళ్ల కిరణ్ కుమార్కిచ్చి గత నెల 27న వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 14 లక్షల నగదు, కామారెడ్డిలో ఒక ప్లాట్, సుమారు 10 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు.
అయితే సుధారాణిని మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.