ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐటి సహా పలు దాడులు. ఈ నేపథ్యంలోనే తాజాగా, తెలంగాణలో బంగారు వ్యాపారులపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు కొరడా ఝుళిపించారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో పాటు పన్నులు ఎగ్గొట్టిన ఆరోపణలపై శ్రీకృష్ణ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ను అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించారు.
డీఆర్ఐ అధికారి మాట్లాడుతూ, ప్రదీప్ కుమార్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 35 కంపెనీలను నిర్వహిస్తున్నాడని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈయనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రదీప్ కుమార్ బంగారాన్ని దిగుమతి చేసుకున్నాడనీ, ఇందుకు పన్నులు కూడా చెల్లించలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.