తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా జనసేనాని పోస్ట్ పెట్టారు. తనలో ఉద్యమ స్ఫూర్తిని, జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని పవన్ పేర్కొన్నారు.
“జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ.
మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

