మరోసారి ధోని అభిమానికి తనదైన శైలిలో స్వాగతం పలికాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆటలో ఎంత సీరియస్గా ఉంటాడో మామూలు సమయాల్లో అంత జాలీగా కనిపిస్తాడు. అలాంటి ధోనీలోని సరదా గుణం నిన్న బయటపడింది. నాగపూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రెండో సెషన్లో భారత్ జట్టు ఫీల్డింగ్ కోసం మైదానంలోకి వెళుతోంది. ఆ సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ధోనీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
ఆ అభిమానిని కాసేపు ఆటపట్టించాలని ధోనీ మైదానంలో పరుగందుకున్నాడు. ఆ వీరాభిమాని కూడా వదలకుండా ధోనీ వెంటపడడంతో చివరికి వికెట్ల వద్దకు వెళ్లి ఆగిపోయాడు. వచ్చిన అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అతను ఆనందంతో ధోనీని ఆలింగనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.