telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

నరహంతక జంటను అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఒంటిపై బంగారం కనిపిస్తే చాలు.. పక్కాగా ప్లాన్ అమలు చేస్తారు. మాయమాటలు చెప్పి వారిని మభ్యపెడతారు. పని ఇప్పిస్తామని చెప్పి బండిపై ఎక్కించుకుంటారు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా చంపేస్తారు. అనంతరం వారి వద్ద ఉన్న ఆభరణాలు, బంగారం దోచుకొని పారిపోతారు. తెలంగాణలో ఈ నరహంతక జంట ఉదంతం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఒంటరి మహిళలే ఆ దంపతుల టార్గెట్. ఇప్పటి వరకు 8 నుంచి 12 మందిని హత్య చేసినట్లు తెలిసింది.

వారిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ పీఎస్ పరిధిలో రెండు, మూడు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమయింది. ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. చివరకు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి. మహిళ కోసం గాలించారు.

ఆమె పని కోసం ప్రతి రోజూ లేబర్ అడ్డాకు వెళ్తుందని తెలుసుకున్న పోలీసులు.. లేబర్ అడ్డా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె మరో ఇద్దరితో కలిసి బండిపై వెళ్లినట్లు గుర్తించారు. ఆ బండి నెంబర్ ఆధారంగా యజమాని, అడ్రస్ వివరాలను తెలుసుకున్నారు. ఆ అడ్రస్‌కు పోలీసులు వెళ్లగా.. అదే సమయంలో భార్యాభర్తలు ఇల్లు ఖాళీ చేస్తూ కనిపించారు.

వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన పద్దతిలో విచారించగా అసలు విషయం తెలిసింది. వారిచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు జిన్నారం అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా చాలా మందిని హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారు. ఇప్పటి వరకు 8 మంది హతమార్చినట్లు భర్త, 12 మందిని చంపామని భార్య చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.

Related posts