telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కోసం రేపటి నుంచి రైతు బంధు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా డిసెంబర్ 27 నుంచి రైతు బంధు సాయాన్ని అందించాలని సర్కార్ భావించినప్పటికీ, ఆ రోజు ఆదివారం కావడంతో సోమవారం నుంచి రైతు బంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపింది. ఇందుకు గాను రూ.7,300 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. గతంలో 36 గంటల్లోనే రైతులందరికీ రైతుబంధు సాయం అందగా, ఈ సారి కరోనా ప్రభావంతో విడతల వారీగా విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 7 వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కోవిడ్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని మంత్రి చెప్పారు. అయితే ముందుగా ఎకరంలోపు పొలం ఉన్న రైతులకు రైతుబంధు సాయాన్ని వారి వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇలాంటి రైతులు 25 లక్షల మంది వరకు ఉంటారని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు ఎకరాల లోపు పొలం ఉన్నవాళ్లకు, ఆపై మూడెకరాల లోపు పొలం ఉన్నవారికి విడతల వారీగా నగదును జమ చేస్తామని, జనవరి 7వ తేదీ నాటికి రైతులందరికీ నగదు సాయం అందుతుందన్నారు. కాగా వర్షాకాలంలో కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి 57.90 లక్షల మంది రైతులకు రూ.7251 కోట్ల సాయం అందింది. యాసంగిలో అదనంగా రూ.1.70 లక్షల మందికి రైతు బంధు సాయం అందించనున్నారు.

Related posts