కార్పొరేట్ పన్నును తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మన దేశంలో కార్పొరేట్ పన్నులు అధికంగా ఉన్నాయని, అదే మనకు పెద్ద విఘాతంగే మారిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పన్ను శాతాన్ని తగ్గించడం శుభపరిణామం అని ఆయన తెలిపారు. ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ సంకేతాన్ని ఇస్తుందన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ సంకేతాన్ని ఇస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న థాయిలాండ్, పిలిప్పీన్స్ దేశాల్లోనూ ఇలాంటి పన్ను విధానమే ఉందన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని పరిశ్రమలు, స్టాక్ మార్కెట్లు స్వాగతించాయి. అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేసిన వారు.. ఈ సంస్కరణ వల్ల ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెడుతుందన్నారు. పెట్టుబడులు కూడా పెరుగుతాయని వ్యాపారవేత్తలంటున్నారు. కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించడం అతి పెద్ద సంస్కరణ అని కోటక్ మహేంద్ర బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సీతారామన్ను బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా కూడా ప్రశంసించారు.