పశ్చిమ బెంగాల్ పరిస్థితులపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కేంద్రానికి నివేదిక అందించారు.ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బెంగాల్ లో పరిస్థితులు మారలేదు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శనివారం జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది.
ఈ క్రమంలో గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి మరీ దిగజారితే రాష్ట్రపతి పాలన విధించక తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారని, అల్లర్లు మరింత పెచ్చరిల్లితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అయితే, రాష్ట్రపతి పాలనపై తాను ప్రధానికి గానీ, కేంద్ర హోంమంత్రికి గానీ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని త్రిపాఠి వెల్లడించారు.