telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

తెలంగాణలో రేపటినుంచి ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

గ్రామస్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహిళా గ్రూపు సంఘాలతో సమన్వయం చేసుకోవాలని డీఆర్డీఓలను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అత్యవసర పడకలు ఏర్పాటు చేసుకోవాలని, మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్లకు వెంటనే వేయాలని చెప్పారు. వైద్య,ఆరోగ్య సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందించి స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులు, స్కూల్లో పనిచేసే ఇతర సిబ్బంది అందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో బాగా పనిచేసిన వారికి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు రోజూ 3 లక్షల మందికి టీకాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదన్న సదుద్దేశంతోనే ఈ డ్రైవ్ చేపట్టాలని సీఎం నిర్ణయించారని అన్నారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18ఏళ్లు పైబడిన వారు 2.80 కోట్ల మంది ఉన్నారని వారిలో ఇప్పటి వరకు 1.45 కోట్ల మంది మొదటి డోస్ తీసుకున్నారని చెప్పారు. 55 లక్షల మంది రెండో డోస్ తీసుకున్నట్లు సీఎస్ తెలిపారు. కంట్రోల్ రూమ్ నిర్వహణ నిరంతరం కొనసాగించాలని వ్యాక్సినేషన్ పూర్తయినట్లు స్టిక్కర్లు వేయాలని సోమేశ్ కుమార్ చెప్పారు. పంచాయతీలలో దండోరా వేయించాలని… విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Related posts