తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కవిత ఓటమి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత ఓడిపోవడానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వివాదమే కారణమని స్పష్టం చేశారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామనీ, కార్మికులకు ఉపాధి కల్పిస్తామని గతంలో కేసీఆర్ చాలాసార్లు హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఆ హామీలను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. నిజామాబాద్ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయిన ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.