రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే దారుణంగా సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని, దురదృష్టకరమైన ఘటన అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తహసీల్దార్ విజయ, ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రానురాను సమాజంలో అసహనం ఎంతగా పెరిగిపోతుందో ఈ ఘటన ద్వారా అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. టెక్నాలజీ పరంగా సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంటే మనిషి మాత్రం మానసికంగా ఎంతో క్రూరంగా మారడం శోచనీయం అని అభిప్రాయపడ్డారు.