ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు.
నేడు పంపిణీ చేసిన ఇళ్లలో 1,00,875 టిడ్కో (TIDCO) గృహాలు ఉండగా, మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గతేడాది నవంబర్ 12న ఇప్పటికే 3 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లను అందించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పేదల ముఖాల్లో ఆనందం చూస్తుంటే నా జన్మ ధన్యమైందనిపిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, పేదల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. పేదలు మురికివాడల్లో కాదు, గౌరవప్రదమైన టిడ్కో ఇళ్లలో ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు కట్టిన రూ. 174 కోట్లను మాయం చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి 82 వేల కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
ప్రతి ఇంటికీ సీఎన్జీ గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, దానికి రాయితీ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, బీసీలకు రూ. 20 వేల విద్యుత్ రాయితీ ఇస్తున్నట్లు గుర్తుచేశారు.
ఏప్రిల్ నుంచి తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, సరిగా పనిచేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్యేల పనితీరుపై కూడా నిఘా ఉంటుందని, ప్రజల మెప్పు పొందని నాయకులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. టెక్నాలజీని ఉపయోగించి పెన్షన్ల పంపిణీని రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు.
“హైదరాబాద్, చెన్నై కంటే గొప్పగా అమరావతిని నిర్మిస్తాం. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం” అని అని చంద్రబాబు అన్నారు.

