దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా, మానవత్వం మంటగలిసేలా మనిషే ఓ మృగంలా మారిపోతున్నాడు. ఓ దుర్ఘటన తాలూకు విషయాలు మరువక ముందే మరో దుర్ఘటన గురించి వినాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంటోంది. పటిష్టమైన పోలీస్, న్యాయ వ్యవస్థ ఉందని చెప్పుకునే ఈ దేశంలో పట్టపగలే అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్లో జరిగిన ఘటనతో దేశంలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విలువలు నేర్పాలని, అప్పుడే ఈ దేశంలో అత్యాచారాలు తగ్గుతాయని వ్యాఖ్యానించిన యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సురేంద్ర సింగ్ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేంద్ర వ్యాఖ్యలపై హీరోయిన్ స్వర భాస్కర్ స్పందిస్తూ “అసహ్యకరమైన ముసలి పాపి” అని కామెంట్ చేసింది. ఇక హీరోయిన్ కృతి సనోన్ స్పందిస్తూ… “అత్యాచారానికి గురవకుండా ఎలా ఉండాలో కూతుళ్లకు నేర్పాలా? అతనేం చెప్పాడో అతనికైనా అర్థమైందా? ఇలాంటి ఆలోచనా ధోరణులు మారాలి. కొడుకులకు ఎందుకు కాస్త సంస్కారం నేర్పరు” అని పేర్కొంది. ఇక పూజా బేడి స్పందిస్తూ “అధికార పార్టీలో ఇలాంటి మూర్ఖులు, పురుషాహంకారులు చాలా మంది ఉన్నారు. ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది.. కదా?” అని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Teach daughters how to not get raped??? Can he hear himself talk? THIS is the MINDSET that needs to change! Its so messed up! Why can’t they give some sanskaar to their sons??? https://t.co/JXj9Tx6YOe
— Kriti Sanon (@kritisanon) October 3, 2020