telugu navyamedia
National రాజకీయ వార్తలు

కేరళ తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ ఎన్నిక

కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ఎన్నికయ్యారు.

మేయర్ ఎన్నికల్లో ఆయన 51 ఓట్లతో విజయం సాధించారు. రాష్ట్ర చరిత్రలో ఒక బీజేపీ నేత మేయర్ పీఠాన్ని అధిరోహించడం ఇదే తొలిసారి కావడంతో ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

ఈ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ కూటమి (ఎల్‌డీఎఫ్) అభ్యర్థి ఆర్.పి. శివాజీకి 29 ఓట్లు రాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. శబరినాథన్‌కు 19 ఓట్లు మాత్రమే లభించాయి.

101 మంది సభ్యులున్న కార్పొరేషన్‌లో మేయర్ పీఠానికి 51 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. డిసెంబర్ 9న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 50 వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

గురువారం రాత్రి ఇండిపెండెంట్ కౌన్సిలర్ పి. రాధాకృష్ణన్ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో వారి బలం 51కి చేరింది. దీంతో రాజేశ్‌ విజయం లాంఛనమైంది.

ఈ విజయంతో దాదాపు 45 ఏళ్లుగా తిరువనంతపురం కార్పొరేషన్‌పై ఉన్న సీపీఎం ఆధిపత్యానికి తెరపడినట్లయింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి మాట్లాడుతూ, “ఇది గతసారే జరగాల్సింది. ఇప్పుడు మేం ఇక్కడ ఉన్నాం. ఇక రాష్ట్రవ్యాప్తంగా నెమ్మదిగా మార్పు మొదలవుతుంది” అని అన్నారు.

అంతకుముందు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫోన్ చేసి రాజేశ్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆశా నాథ్‌ను పార్టీ ఎంపిక చేసింది.

రాజేశ్‌ విజయం ఖరారైన వెంటనే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

Related posts