స్కాట్స్బర్గ్, ఇండియానాలో పిల్లలపై వేధింపుల నేపథ్యంలో విచారణ చేపట్టిన స్కాట్స్ కౌంటీ పోలీసులు ఇద్దరు చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన దంపతులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించిన జంటను కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు. ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సర్వీసెస్ సమాచారంతో ఆగస్టు 19న స్కాట్స్ కౌంటీ పోలీసులు స్థానికంగా దర్యాప్తు చేసి పలువురిని విచారించారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు శారీరకంగా హింసించబడి ఉండడం పోలీసులు గుర్తించారు. నాలుగేళ్లు, ఏడేళ్ల వయసు గల ఆ ఇద్దరు చిన్నారులను శారీరకంగా హింసించడంతో పాటు వారిని ఒక గదిలో నిర్భందించారు. అలాగే పిల్లలకు గత కొన్ని రోజులుగా ఆహారం కూడా పెట్టలేదని పోలీసుల విచారణలో తేలింది. ఇలా పసివాళ్లపై చిత్ర హింసలకు పాల్పడిన స్కాట్స్బర్గ్కు చెందిన మాథ్యూ మోసియర్ (37), అస్టిన్ వాసి హన్నా గ్రేవ్స్ (28) జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ జంటపై 15 కేసులు నమోదు చేసి స్కాట్ కౌంటీ జైలుకు తరలించారు. ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సర్వీసెస్ అధికారులు బాధిత చిన్నారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.