భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు.
కేవలం కొబ్బరికాయ కొట్టగానే క్రెడిట్ వచ్చేయదని జగన్ గ్రహించాలని హితవు పలికారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014-19 మధ్య చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసిందని అప్పలనాయుడు ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 18 నెలల్లోనే ప్రధాని మోదీ సహకారంతో 95 శాతం పనులు పూర్తి చేసిందని, జనవరి 4న తొలి విమానం ల్యాండ్ అయిందని గుర్తుచేశారు.
మరో ఐదారు నెలల్లో, జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అంకితం చేయనున్న తరుణంలో, జగన్ ట్వీట్ చేసి క్రెడిట్ తీసుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ విషయంపై గూడుపువలస, భోగాపురం, పులివెందుల లేదా రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.
“గతంలో ‘ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్పోర్టా?’ అని, ‘విశాఖ ఎయిర్పోర్టుకు దోమలు, ఈగలు వస్తాయి గానీ మనుషులొస్తారా?’ అని అని జగన్ హేళన చేసారు.
ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించిన జగన్, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు తానే కర్తనని చెప్పుకోవడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.


చంద్రబాబు ప్రచారం వల్ల బీజేపీకి లాభమే: దత్తాత్రేయ