డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద బీజేపీ శ్రేణులు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పలుచోట్ల బీజేపీ శ్రేణుల అరెస్టులు జరిగాయి.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది అంటూ ధ్వజమెత్తారు.కేసీఆర్ పాలనలో హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమవుతోందని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్, మంత్రులు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గట్టి సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కరోనా సంక్షోభ సమయంలో ఎల్ఆర్ఎస్ భారం మోపడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనం అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలను, హక్కులను పోలీసుల సాయంతో కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని అన్నారు.