*మంత్రి ఉషశ్రీ ఊరేగింపు ర్యాలీలో అపశృతి..
*పోలీసులు ఓవర్ యాక్షన్ తో చిన్నారి బలి
*చిన్నారి మృతితో బంధువులు ఆందోళన..
*మంత్రి ఉషశ్రీ చరణ్ తీరుపై సర్వత్రా విమర్శలు
అనంతపురం జిల్లా సత్య సాయి జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కల్యాణదుర్గంలో మంత్రి ర్యాలీ సందర్భంగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న7 నెలల పసిపాపను తీసుకుని ఆసుపత్రికి వెళుతున్న తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకోవడంతో.. సకాలంలో వైద్యం అందక ఆ చిన్నారి కన్నుమూసింది.
వివరాల్లోకి వెళితే..
సత్య సాయి జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా కళ్యాణదుర్గం వచ్చారు. దీంతో ఆమెకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. కళ్యాణదుర్గంలో మంత్రిగారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ ఈరక్క దంపతులు తమ చిన్నకుమార్తెకు ఆరోగ్యం బాగులేక 108కు ఫోన్ చేశారు. అయినా రాకపోవడంతో బైక్ పై ఎక్కించుకొని ఆర్జీటీ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారు కళ్యాణదుర్గం చేరుకున్న తర్వాత పోలీసులు ట్రాఫిక్ నిలిపేశారు. ఐతే పాపను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లానని.. వెళ్లేందుకు దారివ్వాలంటూ తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నా వినలేదు. అరగంటపాటు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది.
ఊరేగింపు వెళ్లిన తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారు. కాసేపటి ముందు తీసుకొచ్చిన పాపను బ్రతికించేవాళ్లమని చెప్పడంతో తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదించారు.
సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి చెందిందంటూ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చేస్తున్న చిన్నారి కుటుంబీకులను పట్టించుకోకుండా ఉషశ్రీ వెళ్లిపోయారు. ఘటన జరిగి 15 గంటలు దాటినా బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించలేదు.
అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు