telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానం

ap embulam

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈరోజు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు ఈసారి  పరీక్షలు రాశారని ఆమె తెలిపారు. మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. బాలురు 94.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 95.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటుగా పరీక్ష రాసిన విద్యార్థుల ఉత్తీర్ణత 58.80 శాతం నమోదయిందని చెప్పారు. ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసిన అబ్బాయిల్లో 56.72 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిల్లో 61.82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

11,690 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారని తెలిపారు. వీటిలో 5464 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని సంధ్యారాణి తెలిపారు. గతంలో 17 స్కూళ్లలో సున్నా పాస్ పర్సంటేజ్ ఉండగా ఈసారి అది 3 పాఠశాలలకే పరిమితమయిందని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత విషయంలో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 98.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, కనిష్టంగా నెల్లూరు జిల్లాలో 89.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని స్పష్టం చేశారు. అలాగే ఈ మార్కుల మెమోలను రెండ్రోజుల్లో వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని సంధ్యారాణి తెలిపారు.

Related posts