దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. గురువారం మీడియా సమావేశంలో ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా ప్రమాదకరమని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే వాయిదా పడిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈనెల 31న సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాతే పది పరెక్షల కొత్త షెడ్యూల్ను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు.

