ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నేడు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2006లో జరిగిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో హజారే సాక్షిగా కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుడైన ఎన్సీపీ మాజీ ఎంపీ పదంసిన్హ్ పాటిల్ కూడా కోర్టు ముందు హాజరయ్యారు.
2006 జూన్ లో నవీ ముంబైలోని కలామ్ బోలి ప్రాంతంతో నింబాల్కర్ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణలో అన్నా హజారేను సాక్షిగా చేర్చాలంటూ నింబాల్కర్ భార్య ఆనంది దేవి కోర్టును కోరారు. అయితే ఆమె విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు అన్నా హజారే వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది.