ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కాగా రాజ్యాంగం ప్రకారం కిడారి శ్రవణ్ కుమార్ మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజ్భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.