ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న “అమ్మ ఒడి” పథకం అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి. మరోసారి పరిశీలనకు సచివాలయాలకు చేరాయి. సాధికార సర్వే అనుసంధానంలో జరిగిన తప్పిదాలను నిరూపించే ధ్రువపత్రాలను రెండురోజుల్లోక్షేత్రస్థాయిలోని సచివాలయాలకు అందజేసి పథకం లబ్ధి పొందాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఈ పథకం తొలి జాబితాలో జిల్లా నుంచి 3,17,294 మంది విద్యార్థులు, వారి తల్లులను అర్హులుగా ప్రకటించారు.
విజయనగరం జిల్లాలో ఈ పథకం కోసం ఒకటి నుంచి 10వ తరగతి పాఠశాల, రెండు సంవత్సరాల ఇంటరీ్మడియట్ విద్యార్థులు 3,70,565 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటి నుంచి క్షేత్రస్థాయి సచివాలయాలకు వెళ్లిన మూడు జాబితాలను పంపారు. అన్ని అర్హతలను నిర్ధారించుకొని అనుమతి పొందిన తల్లులు 3,17,294 మంది ఉన్నారు. మరోసారి విచారణ చేయాల్సిన జాబితాలో 21,886 మంది ఉన్నారు. అనర్హతగా నమోదయన అంశాలపై తాజాగా ఎలాంటి ధ్రువపత్రాలున్నా అధికారులు క్షేత్రస్థాయిలో సవరించే అవకాశం ఉంది.