ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వచ్చిన వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ తమ వంతు సాయం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు.
తాజాగా ప్రభాస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు. గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్ ఇండియా స్టార్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు.
అంతకుముందు వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు చిరంజీవి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్బాబు, అల్లు అర్జున్ రూ.25లక్షలు చొప్పున సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.


