ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబీ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంపై ఇవాళ క్యాట్ లో విచారణ జరిగింది. కౌంటర్ పై వివరణ ఇస్తూ ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. కనీస విచారణ లేకుండా తనను సస్పెండ్ చేయడం అఖిల భారత సర్వీసు నిబంధనలకు, చట్టానికి విరుద్ధమని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న క్యాట్ తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

