సూపర్స్టార్ మహేష్ హీరోగా, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా గతకొన్ని రోజులుగా “పొల్లాచ్చి”లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ వారం చివరివరకూ పొల్లాచ్చిలోనే చిత్రీకరణ జరగనుంది. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్ చేశారు. ఆ తరువాత షెడ్యూల్ ను అబుదాబీలో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అయితే “మహర్షి” విడుదల తేదీని ఏప్రిల్ 5 నుంచి 26వ తేదీకి మారుస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఈ వార్తలపై చిత్రబృందం స్పందించలేదు.
ఇక “మహాశివరాత్రి” కానుకగా మార్చి 4న ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయాలనీ చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందని తెలుస్తోంది. ఆ రోజునే టీజర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని సమాచారం. అయితే ఈ విషయాన్నీ చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేశ్ ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నాడనే విషయం తెలిసిందే.