ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయనకు ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ మధ్యాహ్నం ఫలితం వచ్చింది. ఎమ్మెల్యేకి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శివకుమార్ స్పందిస్తూ ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. తాను అందరికీ ఫోన్ లో అందుబాటులోనే ఉంటానని వెల్లడించారు. అవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని పిలుపునిచ్చారు.