నగరంలో కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. వైరస్ నియంత్రణపై బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లోంది. ఇందులో భాగంగా కేసుల అధికంగా నమోదవుతోన్న మెహదీపట్నం, కార్వాన్, యూసుఫ్గూడ, చాంద్రాయణగుట్ట, చార్మినార్, కుత్బుల్లాపుర్, రాజేంద్రనగర్, అంబర్పేట ఎనిమిది సర్కిళ్లను హైరిస్క్ ఏరియాలుగా గుర్తించింది. ఆయా సర్కిళ్లకు నోడల్ ఆఫీసర్లను నియమించింది. లాక్డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాంతాల వారీగా కట్టడి చేశారు.
కేసుల సంఖ్యను బట్టి 100 నుంచి 200 మీటర్లు, అంతకంటే ఎక్కువ పరిధిని కట్టడి ప్రాంతంగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బస్తీలు, కాలనీలు కూడా గతంలో కట్టడి ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన ఇంటినే కట్టడి చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిస్థాయిలో సత్ఫలితాలనివ్వలేదు. దీంతో కేసుల సంఖ్యను బట్టి కట్టడిని వీధి వరకు పెంచుతున్నారు. ఒక వీధ్దిలో నాలుగైదు భవనాల్లో పాజిటివ్ కేసులు నమోదైతే రాకపోకలను నిలిపివేసి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.