ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్డౌన్ సడలింపులు ఇస్తోన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. భారత్తో పాటు ఆయా దేశాలకు పలు హెచ్చరికలు చేసింది. కరోనా విజృంభిస్తున్నపాటికీ సామాజిక దూరం, లాక్డౌన్ వంటి చర్యలు మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగ సీనియర్ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. భారత్ అమెరికా లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని వెల్లడించారు.
కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్డౌన్ ఆంక్షలు సడలించవద్దని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రస్తుతం పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని తెలిపారు. ఇటువంటి సమయంలో వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తివేయడం వల్ల మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. ఆయా దేశాల్లో లాక్డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే విషయంపై బాగా ఆలోచించుకోవాలని తెలిపారు. లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపారు.