దేశ ప్రజలంతా నిబంధనలూ పాటిస్తే కరోనాపై యుద్ధంలో తప్పక గెలిచి తీరుతామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కరోనాపై భారతావని చేస్తున్న పోరాటంలో లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచన కేవలం ఓ గేమ్ చేంజర్ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేశారని, దీనిపై రేపు ఓ కీలక ప్రకటన వెలువడనుందని తెలిపారు.
కరోన కట్టడి కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందించారన్నారు. వచ్చే 19 రోజులూ అదే విధమైన సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 20 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన లాక్ డౌన్ వ్యూహంపైనా కేంద్రం నుంచి సలహాలు, సూచనలు అందుతాయని తెలిపారు. ఆపై రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగానిర్ణయాలు తీసుకోవచ్చని జవదేకర్ సూచించారు.ఎన్నో ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని, విజయం సాధించలేక అల్లాడుతున్నాయని కేంద్రానికి ప్రజల మద్దతు తప్పనిసరని జవదేకర్ అభిప్రాయపడ్డారు.