ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు చేరింది. ఇటలీలో ఆదివారం ఒక్క రోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,500కు చేరింది. ఫ్రాన్స్లో 562 మంది మరణించగా, పారిస్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు (67) ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు.
స్పెయిన్లో తాజాగా మరణించిన 394 మందితో కలుపుకుని ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1720కి చేరింది.బ్రిటన్లో కరోనా ముప్పు ఉందని భావిస్తున్న 15 లక్షల మందిని మూడు నెలలపాటు బయటకు రావొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. అమెరికాలో లక్షలాదిమంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. న్యూయార్క్ సిటీ జైళ్లలో 38 మందికి కరోనా వైరస్ సోకింది. అమెరికాలో ఒక్క రోజులోనే కొత్తగా ఏడువేల కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 26,574కు చేరింది.