చప్పట్లు కొట్టడమనేది ఒక సంఘీభావానికి ప్రతీక అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి, ఐక్యతను చాటుదామని కేసీఆర్ పిలపునిచ్చారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న వాళ్లు బాల్కనీల్లోకి వచ్చి చప్పట్టు కొట్టాలని… గ్రామాల్లో ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని ప్రకటించాలని తెలిపారు. రేపు తాను, తన కుటుంబసభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ బయటకు వచ్చి చప్పట్టు కొడతామని అన్నారు.
జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు 2 నిమిషాల పాటు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన సూచనను అవహేళన చేస్తూ కొందరు పనికిమాలిన వెధవలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నానని అన్నారు.