telugu navyamedia
తెలంగాణ వార్తలు

దూకుడు పెంచిన రేవంత్‌రెడ్డి : నటుడు బండ్ల గణేశ్‌తో చర్చలు..

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. దీనిలో భాగంగా పార్టీకి దూరంగా వుంటున్న వారిని యాక్టీవ్ చేయడంతో పాటు కొత్త చేరికలను ఆయన ప్రొత్సహిస్తున్నారు.

ఈ క్ర‌మంలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేశ్‌ నివాసానికి వెళ్లిన రేవంత్‌ దాదాపు 2 గంటలపాటు ఆయనతో చర్చించారు

అయితే భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాంగ్రెస్‌లోనే వున్నప్పటికీ గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న గణేశ్‌‌ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బండ్ల గణేశ్‌ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తి చూపారు.

కానీ… కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి బండ్ల గణేష్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తూ.. ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు . కానీ, ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనలేదు. దీంతో బండ్ల గణేశ్‌‌ను యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts