టీడీఎల్పీ సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం శాసనసభకు వెళ్లకూడదని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. మండలి రద్దు అంశంపై టీడీఎల్పీలో సుదీర్ఘంగా నేతలు చర్చించారు. న్యాయనిపుణుల అభిప్రాయాలను, పలు నివేదికల సారాంశాలను నేతలు ప్రస్తావించారు. అంతేకాదు మండలి రద్దుపై టీడీపీ నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మండలి రద్దు సీఎం జగన్ అనుకున్నంత సులభం కాదని నేతలు చెప్పారు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదని ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇప్పటికే మండలి రద్దు, పునరుద్ధరణకు వివిధ రాష్ట్రాల తీర్మానాలు కేంద్రం వద్ద ఉన్నాయని యనమల ప్రస్తావించారు. కేంద్రం అంగీకరించినా కనీసం రెండేళ్లు పడుతుందనే యనమల అభిప్రాయపడ్డారు.
బిల్లుల కోసం కక్షతో మండలిని రద్దు చేయడం.. మరో పిచ్చి నిర్ణయం అవుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ ఆలోచనలు ప్రభుత్వానికే డ్యామేజ్ అని మరికొంతమంది నేతలు చెప్పారు. ఏడాదిలో ప్రభుత్వానికి మండలిలో మెజారిటీ వచ్చే అవకాశం ఉందని, రద్దు జరిగితే వైసీపీకే ఎక్కువ నష్టం అని టీడీఎల్పీలో నేతలు చర్చించారు. మండలి పునరుద్ధరణకు వైఎస్ రాజశేఖర్కి మూడేళ్లు పట్టిందని టీడీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. రద్దు వల్ల టీడీపీ ఎమ్మెల్సీలు నష్టపోతే.. అన్ని రకాలుగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.