భారత ఉపసారధి, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ తనదైన శైలి షాట్స్తో జట్టుకు అద్భుత విజయాలు అందించిన ఈ హిట్మ్యాన్ అంతర్జాతీయ మేటి బ్యాట్స్మెన్లో ఒకరు. సెంచరీ అయినా డబుల్ సెంచరీ అయినా ఒక్కసారి రోహిత్ క్రీజులో స్థిరపడితే ప్రత్యర్థులకు చుక్కలే. ఇక తాజాగా రోహిత్ శర్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అతడి పేరుతో హైదరాబాద్ శివారుల్లో ఓ క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. రంగారెడ్డి జిల్లాలోని కన్హలో ఈ స్టేడియంకు శుక్రవారం శంకుస్థాపన పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ, అతడి భార్య రితిక ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు.
రోహిత్ శర్మ యువతకు స్ఫూర్తిదాయకమని, అందుకే స్టేడియంకు అతడి పేరు పెట్టామని.. శ్రీరామచంద్ర మిషన్ అధికారి కమలేష్ పటేల్ అన్నారు. అటు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని, రామచంద్ర మిషన్కు తన తోటి క్రికెటర్లను తీసుకురావాలని ఉందని చెప్పారు.