రాజధాని అనేది సంపద సృష్టించాలని ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ యువతకు భవిష్యత్ ఇచ్చేలా, ఉపాధి కల్పించేలా ‘అమరావతి’ ఉండాలని అన్నారు. లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదని సూచించారు. రాజధాని అమరావతి భావి తరాలకు ‘ఆశ’గా ఉండాలని అన్నారు.
పదమూడు జిల్లాలకు సెంటర్ లో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పదమూడు జిల్లాల అభివృద్ధికి, ఆదాయ వనరని తెలిపారు. నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఉద్యోగాల కల్పవల్లి, ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం ‘మన రాజధాని అమరావతి’ అని అన్నారు. ఆరోజున అందరినీ సంప్రదించిన తర్వాతే ప్రజారాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని చెప్పారు. నాడు శివరామకృష్ణయ్య నివేదికను పట్టించుకోలేదని తమపై వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను ఖండించారు.