అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను ఏపీ ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కృష్ణ కిశోర్ ను సస్పెండ్ చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
డిప్యుటేషన్ పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేయడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. జగన్ క్విడ్ ప్రోకో ద్వారా అవతలి వ్యక్తులకు ఆదాయం వచ్చేలా చేయడాన్ని ఆరోజున ఎవరైతే తప్పుబట్టారో వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ తనతో పాటు సహనిందితులుగా ఉన్న వారిని తన సలహాదారులుగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. జైలులో జగన్ తో ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు ఇచ్చారని విమర్శించారు.